తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి వంటి కీలక నేతలు డీజీపీ ఎదుట లొంగిపోయారు.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి, కరీంనగర్లో ఇంటర్ చదువుతున్నప్పుడే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు.1978లో చారిత్రాత్మక ‘జగిత్యాల జైత్రయాత్ర’తో ప్రభావితుడై, కరీంనగర్, కోరుట్ల RSU అధ్యక్షుడిగా పనిచేశారు. 1982లో పీపుల్స్ వార్లో చేరిన తిరుపతి, 1984లో పార్టీ అగ్రనేత గణపతి సూచనలతో మల్లా రాజిరెడ్డితో కలిసి దండకారణ్యానికి వెళ్లారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీగా దశాబ్దాల కాలం అజ్ఞాత జీవితం గడిపారు.అనారోగ్య కారణాలు లేదా పార్టీ సిద్ధాంతాల పట్ల వైముఖ్యంతో వీరు జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలుస్తోంది. ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
