మ్యాట్రిమోని యాప్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన ఘటన భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. యువతి మాటలు నమ్మిన యువకుడు సుమారు రూ.30 లక్షలు కోల్పోయినట్లు సమాచారం.
వివరాల ప్రకారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన చిద్దురాల సత్యనారాయణ బైక్ మెకానిక్గా పనిచేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. పెళ్లి కోసం మ్యాట్రిమోని యాప్లో వెతుకుతున్న సమయంలో భూపాలపల్లికి చెందిన మేకల మంజుల అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుందామని నమ్మించి భూపాలపల్లిలో ఇల్లు కొనుక్కోవాలని చెప్పడంతో యువకుడు దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసి ఇల్లు కొనుగోలు చేసి, మరమ్మతులు చేయించాడు. అయితే ఆ ఇల్లు యువతి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత అతనిని దూరం చేసినట్లు యువకుడు ఆరోపించాడు.తర్వాత ఆ యువతికి ఇప్పటికే పెళ్లి అయి ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసి యువకుడు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వివరాలు భూపాలపల్లి పోలీసులకు చేరడంతో ఇరువర్గాల వాదనలు తెలుసుకుని విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
