గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం పేరుతో భారీ అక్రమాలు జరిగాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకంలో సుమారు రూ. 6,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
గత ప్రభుత్వ పంపిణీ చేసిన పట్టాలపై విచారణ జరపగా, ప్రాథమికంగా 43,948 మంది అనర్హులుగా తేలారు. మరో 1.11 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. స్మశానాలు, పల్లపు భూములు, ముంపు ప్రాంతాలను సేకరించి.. వాటికి మార్కెట్ ధర కంటే 2-3 రెట్లు అదనంగా చెల్లించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అందుకే 2.5 లక్షల మంది పట్టాలు తీసుకోవడానికి నిరాకరించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా 4,08,876 దరఖాస్తులు అందాయని, ఇప్పటికే 1.03 లక్షల దరఖాస్తులను ఆమోదించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం కేవలం ఒక సెంటు, సెంటున్నర ఇస్తే.. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
