అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరియు చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం ఆమె అమరావతిలో మీడియాలో మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీల వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం రూ. 86.68 లక్షలు విడుదల చేశామని, ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా వ్యవస్థను చక్కదిద్దామని తెలిపారు. 58,204 మంది సిబ్బందికి రూ. 75 కోట్ల వ్యయంతో 5జీ స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.గ్రాట్యుటీ సమస్య పరిష్కారానికి 2025 బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించామని చెప్పారు. 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా మారుస్తున్నామని, దీని ద్వారా అదనంగా 5,000 మంది సహాయకులను నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు.అంగన్వాడీల ప్రధానమైన 9 డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిందని, వారి సంక్షేమమే మా ప్రాధాన్యత అని అనిత స్పష్టం చేశారు.
