రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలోని చేనేత స్టాళ్లను సందర్శించిన ఆయన, స్వయంగా వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించారు.
ఏప్రిల్ 1వ తేదీ నుండి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. చేనేత సహకార సంఘాలకు గతంలో ఉన్న బకాయిలను ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోందని తెలిపారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు ఎగ్జిబిషన్లు, స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, అసెంబ్లీలో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుండి మంచి స్పందన లభిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థికాభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
