నియోజకవర్గ ప్రగతిపై ఫోకస్ పెంచిన మంత్రి కొలుసు పార్థసారథి, క్షేత్రస్థాయిలో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, నూజివీడు ఏరియా ఆసుపత్రి మరియు పీహెచ్సీల పనితీరుపై ఆయన ఆకస్మిక సమీక్ష నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై వార్డెన్ను నిలదీశారు. మెనూ ప్రకారం భోజనం అందించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని, గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరించారు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్యం, మందుల పంపిణీ మరియు రోగుల పట్ల వైద్యుల ప్రవర్తన మారాలని సూచించారు. ఫిర్యాదుల కోసం కంప్లయింట్ బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ప్రజల సంతృప్తిని ప్రామాణికంగా తీసుకునే కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు.
