అత్యంత అరుదైన జన్యుపరమైన అనారోగ్య సమస్యతో (Spinal Muscular Atrophy – SMA) పోరాడుతున్న చిన్నారి పునర్వికను కాపాడుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుకొచ్చారు. ఈ చిన్నారికి వేయాల్సిన ఖరీదైన ఇంజెక్షన్ కోసం తన వంతుగా రూ. 6 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు.
వెన్నెముక కండరాల క్షీణత (SMA) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు ‘జోల్గెన్స్మా’ (Zolgensma) అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఖరీదు సుమారు రూ. 16 కోట్ల పైమాటే. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి లోకేష్, వెంటనే స్పందించి రూ. 6 కోట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పనుల కంటే ఒక ప్రాణాన్ని కాపాడటం మిన్న అని భావించిన మంత్రి చొరవను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు కొనియాడుతున్నారు.
