నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శాసనసభలో గళం విప్పారు. రాపూరు ప్రాంతాన్ని సాగునీటి కరువు నుంచి గట్టెక్కించేందుకు నిలిచిపోయిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను తక్షణమే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాపూరు చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చే పనులు ఆగిపోవడం వల్ల వేలాది ఎకరాలు బీడుగా మారాయని, వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. 2007లో ప్రారంభమైన ఈ పనులు అటవీ అనుమతుల సాకుతో నిలిచిపోయాయని, దీనివల్ల 35 వేల ఎకరాలకు నీరు అందడం లేదని సభ దృష్టికి తెచ్చారు. డక్కిలి మండలంలోని వెలికల్లు, మోపూరు తదితర ప్రాంతాలకు స్లూయిస్ల ద్వారా నీరు మళ్లించాలని, అలాగే ఊట్లపల్లి వద్ద తెలుగుగంగ కాలువకు లిఫ్ట్ ఏర్పాటు చేసి బాలాయపల్లి మండల గ్రామాలకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సాగునీటి ప్రణాళికలను అమలు చేస్తేనే ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.
