పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద “పిడుగురాళ్ల మండల స్వచ్ఛ రథం”ను స్థానిక శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు.
పిడుగురాళ్ల మండల పరిధిలోని గ్రామాల్లో ఈ స్వచ్ఛ రథం తిరుగుతుంది. ప్రజలు తమ ఇళ్ల వద్ద ఉన్న పొడి చెత్తను (ప్లాస్టిక్, పేపర్ తదితరాలు) ఈ రథానికి అప్పగిస్తే, అందుకు ప్రతిగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను అక్కడికక్కడే అందజేస్తారు. గ్రామాలు ప్లాస్టిక్ రహితంగా ఉండటంతో పాటు, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే యరపతినేని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
