ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్లిన ఒక భారతీయ విద్యార్థి జీవితం అనూహ్యంగా యుద్ధరంగంలోకి మలుపు తిరిగింది. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికించి రష్యా సైన్యం తనను బలవంతంగా యుద్ధంలోకి పంపిందని, ప్రస్తుతం తాను ఉక్రెయిన్ దళాల వద్ద బందీగా ఉన్నానని గుజరాత్కు చెందిన సాహిల్ మజోఠీ (22) వీడియో ద్వారా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాడు.
గుజరాత్లోని మోర్బికి చెందిన సాహిల్, 2024 జనవరిలో కంప్యూటర్ ఇంజినీరింగ్ కోసం రష్యా వెళ్లాడు. పార్ట్టైమ్ కొరియర్ బాయ్గా పనిచేస్తున్న సమయంలో ఒక పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయనే నెపంతో రష్యా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏడాది పాటు సైన్యంలో పనిచేయాలని రష్యా అధికారులు సాహిల్ ముందు నిబంధన పెట్టారు. జైలుకు వెళ్లడం ఇష్టం లేక సైన్యంలో చేరిన అతడిని, కేవలం 15 రోజుల శిక్షణతో ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారు. యుద్ధభూమి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో సాహిల్ ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయాడు. సెప్టెంబర్ నుంచి అక్కడే బందీగా ఉన్నాడు. రష్యాలో చదువుల కోసం వచ్చే భారతీయులు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నకిలీ కేసుల్లో ఇరికించి బలవంతంగా యుద్ధంలోకి పంపుతున్నారు. నాలాంటి వారు వందల సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్నారు. ప్రధాని మోదీ గారు దయచేసి నన్ను కాపాడి నా కుటుంబం వద్దకు చేర్చండి” అని సాహిల్ కన్నీటితో వేడుకున్నాడు.
