జిల్లాలో నేరగాళ్లకు సింహస్వప్నంగా మారుతున్నారు నెల్లూరు పోలీసులు. తాజాగా గూడూరులో ఓ ఉపాధ్యాయురాలిపై జరిగిన అమానుష దాడి కేసును జిల్లా ఎస్పీ ఆజిత వేజెండ్ల ఆధ్వర్యంలోని బృందం రికార్డు సమయంలో ఛేదించింది.
బాలాయపల్లి మండలంలో టీచర్గా పనిచేస్తున్న హరిత (35), గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. మార్గమధ్యంలో గూడూరు రూరల్ పరిధిలోని కందలి (చీమకుర్తి మార్గం) సమీపంలో ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి, ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని, రక్తమోడుతున్న ఆమెను రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ బాధితురాలు ధైర్యంగా పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ఆజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గూడూరు క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, కేవలం మూడు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దాడికి ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు,ప్రస్తుతం నెల్లూరు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు హరితను అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సి.హెచ్. సౌజన్య పరామర్శించి, ప్రభుత్వం మరియు పోలీసు శాఖ తరపున ధైర్యం చెప్పారు. నిందితుడిని వేగంగా అరెస్టు చేసిన గూడూరు పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
