సైదాబాద్ ప్రైవేట్ స్కూల్పై ఫిర్యాదు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
విద్యార్థులకు ఇస్లామిక్ ప్రార్థనలు, మతపాఠాలు తప్పనిసరి చేశారనే ఆరోపణలపై విచారణ
హైదరాబాద్: సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఇస్లామిక్ మతపాఠాలు, ప్రార్థనలను హోమ్వర్క్గా తప్పనిసరి చేశారనే ఆరోపణలపై National Human Rights Commission (NHRC) స్పందించింది.
ఈ వ్యవహారంపై తెలంగాణ అధికారుల నుంచి Action Taken Report (ATR) కోరుతూ NHRC నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఫిర్యాదు ఆధారంగా Director of School Education, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ (District Magistrate), హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు పంపింది. ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని సూచించింది.
ఫిర్యాదు ప్రకారం, సైదాబాద్లోని ప్రైవేట్ పాఠశాల అధికారిక స్కూల్ డైరీల ద్వారా విద్యార్థులకు ఇస్లామిక్ మతపాఠాలు, ప్రార్థనలను హోమ్వర్క్గా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై తల్లిదండ్రులు ప్రశ్నించగా, అది పొరపాటు వల్ల జరిగిందని పాఠశాల యాజమాన్యం చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇలాంటి సూచనలు ఒకసారి కాదు, పలుమార్లు నమోదయ్యాయని కూడా ఆరోపించారు.
ఆరోపణలు నిజమైతే విద్యార్థుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశంగా ప్రాథమికంగా కనిపిస్తున్నాయని NHRC అభిప్రాయపడింది.
ఈ కేసును NHRC బెంచ్ స్వీకరించి, సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి తమ నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది.



