తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని తెలంగాణ రాష్ట్రంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. సరఫరాను ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మే నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్దిని నమోదు చేసినట్లు చమురురంగ కంపెనీలు తెలిపాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల బుకింగులు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించాయి. వినియోగదారులు ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేసుకోవద్దని కోరాయి. ఎస్సెమ్మెస్, మిస్డ్ కాల్, ఐవీఆర్ఎస్, ఆన్లైన్ వేదికల ద్వారా ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవాలని ఎల్పీజీ వినియోగదారులను కంపెనీలు ప్రోత్సహించాయి. సిలిండర్ల సరఫరాలో అక్రమాలను అరికట్టడానికి, అసలైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు ఓటీపీ ఆధారిత సిలిండర్ డెలివరీ అథెంటికేషన్ కోడ్ వ్యవస్థను అనుసరించాలని సూచిస్తున్నాయి.
