శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒంటిమిట్టలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, రాముడు పేరు వినగానే సుపరిపాలన గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని శ్రీరాముణ్ని ప్రార్థించినట్లు తెలిపారు.విభజన అనంతరం ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసి ప్రతి ఏడాది ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందాలని, రామరాజ్యంలా మంచి పాలన అందించేందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

