కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు శనివారం తెల్లవారుజామున మెగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. “ఆపరేషన్ వజ్రప్రహర్”లో భాగంగా మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేలులోని శివనగర్, సుందరయ్య కాలనీల్లో ఈ తనిఖీలు చేపట్టారు.

బద్వేలు అర్బన్, రూరల్ సీఐలు, ఎస్ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 20 వేల విలువైన పటాకులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 13 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. పత్రాలు చూపి వాహనాలను తీసుకెళ్లాలని యజమానులకు సూచించారు.నేరాల నియంత్రణే లక్ష్యంగా ఇటువంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు
