ఏపీలోని పల్నాడు జిల్లాలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం, కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కోనూరు గ్రామంలోని కుంకలగుంట గంగయ్య అనే వ్యక్తి ఇంటికి బంధువులు వచ్చారు. సరదాగా గడిపేందుకు 10 మంది కలిసి ఒక చిన్న పడవలో నదిలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పడవ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్నవారంతా నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగిలిన నలుగురు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యల్లో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

