రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రాజెక్టును రద్దు చేసిన ప్రభుత్వం
చెన్నై సమీపంలోని పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు.
సాగు భూములు, రైతుల జీవనోపాధిని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రాజెక్టు రద్దుపై స్టాలిన్ తీవ్ర విమర్శలు
ప్రభుత్వ నిర్ణయంపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.
పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేయడం తమిళనాడు అభివృద్ధికి తీరని నష్టమని విమర్శించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్టాలిన్ స్పందిస్తూ.. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని సూచించారు.
అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాతే పరందూర్ ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ కోసం ఎంపిక చేశామని చెప్పారు.
భూసేకరణ దాదాపు తుది దశకు చేరుకున్న సమయంలో ప్రాజెక్టును రద్దు చేయడం హేతుబద్ధం కాదని స్టాలిన్ అన్నారు.
ఈ నిర్ణయం పొరుగున ఉన్న పోటీ రాష్ట్రాలకు ‘జాక్పాట్’ లాంటిదని వ్యాఖ్యానించారు.
తమిళనాడు యువతకు లభించే ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
5,369 ఎకరాల్లో సాగు భూములు, జలాశయాలు
పరందూర్ ఎయిర్పోర్ట్ కోసం 5,369 ఎకరాలను కేటాయించారు. ఇందులో సగానికి పైగా సాగు భూములు, జలాశయాలు ఉన్నట్లు సమాచారం.
దీంతో పరందూర్ సహా పరిసరాల్లోని 12 గ్రామాల రైతులు చాలాకాలంగా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
రైతుల నిరసనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్రాజెక్టును ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం విజయ్ తెలిపారు.
అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్
నిబంధన 110 కింద ఎలాంటి చర్చకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడాన్ని డీఎంకే ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. నిరసనగా వారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
2022లో రూ.27 వేల కోట్లతో ప్రాజెక్టు ప్రకటన
గత డీఎంకే ప్రభుత్వం 2022లో పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును ప్రకటించింది.
దాదాపు రూ.27,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టాలని అప్పట్లో నిర్ణయించారు.
అయితే పరందూర్ ప్రాజెక్టు రద్దయినప్పటికీ చెన్నైలో విమాన ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనుంది.
ప్రస్తుతం ఉన్న చెన్నై విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు మరో అనువైన ప్రాంతంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణంపై త్వరలో స్పష్టమైన ప్రణాళికను ప్రకటిస్తామని సీఎం విజయ్ హామీ ఇచ్చారు.



