కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పాదన దిశగా అడుగులు పడ్డాయి. సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డా. సంక్రాంతి చంద్రశేఖర్ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల విండ్ మిల్ మరియు సోలార్ ప్యానల్ ప్రాజెక్టును కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు శుక్రవారం ప్రారంభించారు.
గాలి మరియు సూర్యరశ్మి ద్వారా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ పరికరం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ అందుబాటులోకి రావడం గర్వకారణమని తుమ్మల బాబు పేర్కొన్నారు. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా ఉచిత సేవలు అందించడమే కాకుండా, విద్యుత్ కొరత నివారణకు ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేయడం అందరికీ స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. భవిష్యత్ తరాల వారికి సోలార్ మరియు విండ్ మిల్ ప్రాధాన్యతను తెలియజేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓబుల శెట్టి గున్ని, బళ్లమూడి హరికృష్ణ మరియు టీడీపీ నాయకులు చల్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
