నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొనలో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం విశేష పూజలు, అగ్నిరాధన నిర్వహించారు. సాయంత్రం శ్రీవారికి నిత్యహోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హంసవాహన సేవను ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
