భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో UPI కీలక మలుపు: మోదీ
10 ఏళ్లలో 12,000 రెట్లు పెరిగిన లావాదేవీలు.. 11 దేశాల్లో UPI సేవలు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రారంభమై 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దీనిపై ప్రశంసలు కురిపించారు.
భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో UPI ఒక కీలక మలుపుగా నిలిచిందని చెప్పారు.
మోదీ X వేదికగా స్పందిస్తూ, పదేళ్ల క్రితం UPIని ప్రారంభించామని, అది భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా మారిందని చెప్పారు.
UPIతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులను, వ్యక్తిగత అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని దేశ ప్రజలను కోరారు.
11 దేశాల్లో UPI సేవలు:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన UPI.. భారత్ డిజిటల్ పేమెంట్స్ విప్లవానికి కీలకంగా మారింది. ప్రస్తుతం 11 దేశాల్లో ఈ పేమెంట్ ని అంగీకరిస్తున్నారు. గ్రీస్, మాల్దీవులు తాజాగా ఈ రియల్టైమ్ పేమెంట్ ప్లాట్ఫామ్ను స్వీకరించిన దేశాలుగా నిలిచాయి.
భూటాన్, నేపాల్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, ఖతార్లలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభంగా జరుగుతున్నాయి.
10 ఏళ్లలో భారీగా పెరిగిన లావాదేవీలు:
గత పదేళ్లలో లావాదేవీల సంఖ్య, విలువ భారీగా పెరిగాయి. సోమవారం విడుదలైన అధికారిక ఫ్యాక్ట్షీట్ ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్లుగా ఉన్న వార్షిక లావాదేవీలు 2025-26లో 24,162 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 12,000 రెట్లు పెరిగాయి.
లావాదేవీల వార్షిక విలువ కూడా రూ.0.07 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.314 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 4,000 రెట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది.
జూలైలో 2,365.8 కోట్ల లావాదేవీలు:
2026 జూలై నాటికి UPI నెట్వర్క్లో 741 బ్యాంకులు ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నాయి. ఆ నెలలో 2,365.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.29.87 లక్షల కోట్లుగా నమోదైంది.
ప్రపంచ రియల్టైమ్ పేమెంట్స్లో 49 శాతం:
2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన రియల్టైమ్ పేమెంట్ లావాదేవీల్లో దాదాపు 49 శాతంగా ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన ‘Growing Retail Digital Payments: The Value of Interoperability’ నివేదికలో ఈ విజయాన్ని ప్రస్తావించింది.
ఫింగర్ప్రింట్, ఫేస్ అన్లాక్తో చెల్లింపులు:
2025లో UPI కోసం ఆన్-డివైస్ ఆథెంటికేషన్ను ప్రవేశపెట్టారు. దీంతో స్మార్ట్ఫోన్ ఫింగర్ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం వచ్చింది.
ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్తో UPI PIN ఏర్పాటు ప్రక్రియ మరింత సులభమైంది. ముఖ్యంగా తొలిసారి UPI ఉపయోగించే వారు, సీనియర్ సిటిజన్లు, కార్డులు సులభంగా అందుబాటులో లేని వారికి ఇది ఉపయోగకరంగా మారింది.



