అరుణాచలం: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ అరుణాచలంలో పర్యటించారు. పంచభూత లింగాలలో ఒకటైన అగ్ని లింగాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాదాపు 200 మంది బీజేపీ నాయకులతో కలిసి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రానికి మంచి జరగాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడి ఆశ్రమ ట్రస్టీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ పర్యటనలో భాగంగా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి అరుణాచలం వచ్చి నివసిస్తున్న సాద్వి మాధవిని మాధవ్ కలిశారు. ఆమె రాసిన వివిధ ధార్మిక రచనల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా శైవక్షేత్రాల విశిష్టతపై ఆమె చేసిన రచనలను సాద్వి మాధవి ఆయనకు వివరించారు.
