నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాలెం గ్రామంలో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని రాజకీయ బలంతో కబ్జా చేశారంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

1981వ సంవత్సరంలో దండే పెంచల లక్ష్మమ్మ అనే మహిళ, అప్పటి గ్రామానికి చెందిన తలారి వద్ద నుండి 30 అంకణాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కొన్నాళ్లు అక్కడే నివసించిన ఆమె, ఉపాధి నిమిత్తం చెన్నైకి వలస వెళ్లారు. ఆమె లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న సదరు తలారి కుమారుడు పెంచలయ్య, రాజకీయ అండదండలతో ఆ స్థలాన్ని ఆక్రమించాడు. అంతేకాకుండా అందులో అక్రమంగా ఒక భవనాన్ని కూడా నిర్మించేశాడు. తన స్థలం గురించి ప్రశ్నించినందుకు పెంచలయ్య దురుసుగా ప్రవర్తిస్తూ, “దిక్కున్న చోట చెప్పుకో” అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాడని లక్ష్మమ్మ వాపోయింది. కష్టపడి కొనుక్కున్న భూమిని కబ్జా చేయడమే కాకుండా ప్రాణహాని తలపెడుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.రాజకీయ పలుకుబడితో సామాన్యుల ఆస్తులను హరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
