ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టోర్నీలో జాతి వివక్ష వివాదం చెలరేగింది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మపై పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి బయటకు రావడంతో అతడు చిక్కుల్లో పడ్డాడు. అర్ష్దీప్ సింగ్ తిలక్ వర్మను, “ఓయ్ అంధేరే, సన్స్క్రీన్ లగాయా (హే నల్లగా ఉన్నవాడా, సన్స్క్రీన్ రాసుకున్నావా?)” అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ వాతావరణంలో ఉన్న జాత్యహంకారంపై చర్చకు కారణమైంది.
అర్ష్దీప్ తిలక్ను “అంధేరా” అని పిలిచాడు. అతని చర్మం రంగును నమన్ ధీర్తో పోల్చాడు. దీనికి తిలక్ వర్మ ఎంతో పరిణతితో స్పందిస్తూ, “నేను దీనిని ప్రోత్సహించను. రేపటి మ్యాచ్పై దృష్టి పెడదాం” అని బదులిచ్చాడు. మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఈ వివాదంపై స్పందించారు. ఆటగాడిగా, వ్యాఖ్యాతగా తన కెరీర్లో వర్ణవివక్ష ఆధారిత వ్యాఖ్యలు ఎదుర్కొన్న తన బాధాకరమైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అర్ష్దీప్ సింగ్కు కఠిన శిక్ష విధించాలని మాజీ స్పిన్నర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (X) లో డిమాండ్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ కొత్త వివాదంపై ఎలా స్పందిస్తుందోనని క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరగా దర్యాప్తు చేసి సంతృప్తికరమైన ముగింపు పలకాలని చాలామంది బోర్డును కోరుతున్నారు.

