ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులోకి రాజస్థాన్ రాయల్స్ అడుగు పెట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 30 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ తమ స్థానాన్ని పదిలం చేసుకోవడమే కాకుండా, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లను టైటిల్ వేటకు దూరం చేసింది. చండీగఢ్లో మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. జోఫ్రా ఆర్చర్ (15 బంతుల్లో 32), రవీంద్ర జడేజా (11 బంతుల్లో 19 నాటౌట్) ఆఖర్లో రాణించడంతో జట్టు స్కోరును 200 దాటించారు.
206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో రోహిత్ శర్మను డకౌట్గా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత నమన్ ధిర్ (6), రియాన్ రికెల్టన్ (12), తిలక్ వర్మ (3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 60), విల్ జాక్స్ (33), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను 9వ స్థానంతో ముగించింది.

