2030వ సంవత్సరం నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద డ్రోన్ మార్కెట్గా భారత్ అవతరించడమే లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో డ్రోన్ల పరిశోధన (R&D), విడిభాగాల తయారీ పురోగతిపై అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ విజన్లో భాగంగా డ్రోన్ సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించడమే ధ్యేయమని మంత్రి తెలిపారు.

డ్రోన్ల విడిభాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం తగ్గించి, స్వదేశీ తయారీని (Indigenous Manufacturing) ప్రోత్సహించేలా పెట్టుబడులను సులభతరం చేస్తామన్నారు. డ్రోన్ రంగంలో స్టార్టప్లకు, పరిశోధకులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.డ్రోన్ టెక్నాలజీపై పెట్టుబడులు, లైసెన్సింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేయడంపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.భారతదేశాన్ని అంతర్జాతీయ డ్రోన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విమానయాన మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
