ప్రత్తిపాడు నియోజకవర్గం మీదుగా సాగుతున్న అరుదైన తాబేళ్ల అక్రమ రవాణాను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఏలేశ్వరం వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా తాబేళ్లను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎవరికీ అనుమానం రాకుండా గోనె సంచులలో కుక్కి తరలిస్తున్న ‘ఇండియన్ సాఫ్ట్ షెల్’ (Indian Soft-shell) రకానికి చెందిన తాబేళ్లను అధికారులు గుర్తించారు. ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ జాబితాలోకి వస్తాయి. రాష్ట్ర డీజీపీకి అందిన పక్కా సమాచారంతో అధికారులు మాటు వేసి వాహనాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఏలేశ్వరం రేంజ్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టుబడిన తాబేళ్లను సురక్షితంగా ఏలేశ్వరం రిజర్వాయర్లోకి విడుదల చేస్తామని తెలిపారు.
