తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు మళ్లీ తలెత్తాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా, జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో జరిగిన సినీ కార్మికుల సమావేశానికి కూడా ఆయన హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.టిక్కెట్ల రేట్ల అంశంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, పీసీసీ చీఫ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఇటీవల హైకమాండ్ నుంచి హెచ్చరికలు రావడంతో ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.జిల్లా అభివృద్ధి, అధికారుల నియామకాల విషయంలో తనకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే భావనతోనే కోమటిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.మరోవైపు, మంత్రి వర్గ విస్తరణ సమయంలో తన స్థానంపై వచ్చిన ప్రచారం కూడా ఈ అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
