ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో, ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది.
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభ్సిమ్రాన్ సింగ్ (2) పెవిలియన్ చేరారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) కూడా విఫలమవడంతో పంజాబ్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కనోలీ (37), సూర్యాంశ్ షెడ్గే (35), మార్కస్ స్టొయినిస్ (37) పోరాడారు. ఆఖర్లో శశాంక్ సింగ్ కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులతో చెలరేగాడు. అయినప్పటికీ చివరికి పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ బ్యాటింగ్కు దిగింది. ఆరంభంలోనే జాకబ్ బెథెల్ (11) వికెట్ కోల్పోయినా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సులు), దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సులు) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వెంకటేశ్ అయ్యర్ కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28) కూడా మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.
