గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా యువత జీవితాల్లో విడదీయరాని భాగంగా మారాయి. అయితే అవి సరైన పర్యవేక్షణ లేకుండా వాడితే ఎంత ప్రమాదకరమో గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న తాజా సంఘటన మరోసారి వెల్లడించింది.
గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని కోబాల్ట్ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక, ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా పరిచయమైన అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో చాటింగ్ చేస్తూ ప్రేమలో పడింది. ఈ పరిచయం కొద్ది రోజుల్లోనే శారీరక సంబంధంగా మారింది. దాంతో మైనర్ బాలిక గర్భవతిగా మారింది.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుసుకున్న వెంటనే షాక్కు గురై, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేస్తూ, “పిల్లలు సెల్ఫోన్లలో ఏమి చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి” అని సూచించారు. అలాగే, స్కూల్, కాలేజీ సమయాల్లో వారి కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు.
