న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దర్యాప్తును కొంతకాలం పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లోపాలకు బాధ్యులెవరో తేల్చాల్సిందేనని, “నిజమైన జవాబుదారీతనం వచ్చే వరకు సమస్య ఆగదు” అని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జవాబుదారీతనంపైనే ప్రశ్నలు
నీట్ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చాలన్న ప్రతిపాదన సహా పలు వినతులను కోర్టు పరిశీలించింది. గతంలో జరిగిన లీక్ల నుంచి ఎన్టీఏ పాఠాలు నేర్చుకోలేదని కోర్టు వ్యాఖ్యానించింది. యూపీఎస్సీ పరీక్షల్లో ఇలాంటి ఘటనలు జరగవని గుర్తుచేస్తూ, “ఈ వైఫల్యం ఎలా జరిగింది?” అని ఎన్టీఏను ప్రశ్నించింది.
“విద్యార్థులే కాదు, వారి కుటుంబాల ఆశలు, సమయం, భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు బాధాకరం” అని జస్టిస్ నరసింహ అన్నారు.
100కు పైగా సిఫార్సులు
మాజీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ను కోర్టు వివరణ కోరింది. హైపవర్ కమిటీ చేసిన 100కు పైగా సిఫార్సుల్లో 60 స్వల్పకాలిక చర్యలు 2025-26 పరీక్షల కోసం రూపొందించామని, వాటిలో ఎక్కువ భాగం అమలయ్యాయని ఆయన తెలిపారు.
2025లో నీట్-యూజీ పరీక్ష సజావుగా జరిగిందని, కొన్ని కేంద్రాల్లో విద్యుత్ అంతరాయాలు మినహా సిఫార్సులు పనిచేశాయని చెప్పారు. అయితే లీక్ ఎలా జరిగిందన్న ప్రశ్నకు, ప్రశ్నపత్రాల తయారీ దశలో లోపం ఉన్నట్లు గుర్తించామని, ఇప్పుడు ఆ లోటును కూడా సరిచేశామని కోర్టుకు వివరించారు.
ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది.

