తెలంగాణలో సినిమా టికెట్ ధరలను సవరించిన ప్రభుత్వం
థియేటర్ల వర్గీకరణ ఆధారంగా కనిష్ఠ, గరిష్ఠ రేట్లు నిర్ణయం
సినిమా టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలుగు సినీ రంగానికి, థియేటర్ యాజమాన్యాలకు, ప్రేక్షకులకు కీలకమైన సినిమా టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని థియేటర్ల నిర్వహణను మరింత పారదర్శకంగా చేయడంతో పాటు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాన్య ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసింది.
సింగిల్ స్క్రీన్ల నుంచి మల్టీప్లెక్స్ల వరకు థియేటర్ల వర్గీకరణ ఆధారంగా టికెట్ ధరలకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్, స్పెషల్ థియేటర్లకు కొత్త రేట్లు
కొత్త నిబంధనల ప్రకారం నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70గా నిర్ణయించారు.
ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.100 వరకు ఉండనుంది.
సాధారణ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.150 వరకు ఉంటుంది.
ప్రీమియం కేటగిరీలో టికెట్ ధర రూ.100 నుంచి రూ.200 మధ్య ఉండనుంది.
సాంకేతికంగా అధునాతన సదుపాయాలు ఉన్న స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం సీట్ల ధరను కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250గా ప్రభుత్వం నిర్ణయించింది.
మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు ఎంతంటే?
ఆధునిక మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా వీక్షణ అనుభవాన్ని బట్టి టికెట్ ధరలను నిర్ణయించారు.
మల్టీప్లెక్స్లలో కనిష్ఠ టికెట్ ధర రూ.200గా, గరిష్ఠ ధర రూ.300గా ఖరారు చేశారు.
కొత్త ధరల వర్గీకరణతో అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, థియేటర్ల నిర్వహణకు కూడా వెసులుబాటు కల్పించేలా నిబంధనలను రూపొందించారు.
ఈ ధరల సవరణతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు కొత్త ఉత్సాహం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది.
అదే సమయంలో సినిమా టికెట్ ధరల నియంత్రణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



