డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే పూర్తి చేసిన ఫారం తప్పనిసరి
ఫారంలో ఫోటో, సంతకం, తేదీతో పాటు వివరాలు సరిగా నమోదు చేయాలని సూచన
హైదరాబాద్: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ఓటర్లకు కీలక సూచనలు చేశారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు సమర్పించాలని కోరారు. ఇలా చేయడం ద్వారా తమ ఓటు హక్కును కాపాడుకోవచ్చని తెలిపారు.
ఫారం నింపేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి, ఓటరు సంతకం, తేదీతో పాటు BLO సంతకం కూడా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
ప్రతి ఓటరికి రెండు ఎన్యూమరేషన్ ఫారాల కాపీలు ఇచ్చామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందులో ఒక కాపీని సంబంధిత BLOకు సమర్పించాలి. మరో కాపీని భవిష్యత్తు అవసరాల కోసం ఓటరు దగ్గరే ఉంచుకోవాలని సూచించారు.
పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారం BLOకు తిరిగి అందిన తర్వాతే సంబంధిత ఓటరు పేరు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో చేర్చబడుతుందని ఆయన స్పష్టం చేశారు.
SIR-2002 జాబితాలో ఇప్పటికే వివరాలు ఉన్న ఓటర్లు అందులోని సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఫారం పూర్తి చేయాలని చెప్పారు. ఒకవేళ ఆ వివరాలు అందుబాటులో లేకపోతే, ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత వివరాలతో ఫారం నింపి సంబంధిత BLOకు సమర్పించాలని సూచించారు.



