రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుని కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. సోమవారం కరీంనగర్ R&B గెస్ట్ హౌస్లో సుడ (SUDA) ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలిచి, కేసీఆర్ అహంకారపూరిత పాలనకు చరమగీతం పాడారని మంత్రి అన్నారు. గత రెండేళ్లుగా కేసీఆర్ ప్రజలను గాలికొదిలేసి ఫామ్హౌస్కే పరిమితమయ్యారని, అసెంబ్లీలో ఇరిగేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్నా ఆయన హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. గత పదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ను విచ్చలవిడిగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. పార్టీ ఉనికి పోతుందనే భయంతోనే ఇప్పుడు కేటీఆర్, హరీశ్ రావు బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.కేటీఆర్కు అహంకారం తలకెక్కిందని, హరీశ్ రావు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి పదవిపై వారు చేసే వ్యాఖ్యలు వారి సంస్కారాన్ని తెలియజేస్తున్నాయని మంత్రి ఘాటుగా స్పందించారు.
