జిల్లాలోని కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో గల రామాలయంలో మంగళవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సీతాదేవి అమ్మవారి మెడలోని సుమారు 4 గ్రాముల బంగారు తాళిబొట్టును ఎత్తుకెళ్లారు.
ఆలయంలోని హుండీని పగులగొట్టిన దొంగలు, అందులో ఉన్న సుమారు రూ. 20,000 నగదును అపహరించారు.నగదు తీసుకున్న అనంతరం ఖాళీ హుండీని ఆలయ సమీపంలోని గడ్డివాము వద్ద పడేసి పరారయ్యారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కలువాయి ఎస్ఐ ఎస్. కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
