నగర శివారులో తీరని విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మృతులను బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి (38), ఆమె కుమారుడు విశాల్ రెడ్డి (ఇంటర్ ఫస్ట్ ఇయర్), కుమార్తె చేతన రెడ్డి (ఇంటర్ సెకండ్ ఇయర్)లుగా పోలీసులు గుర్తించారు.శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై మృతదేహాలను గమనించిన ఒక గూడ్స్ రైలు లోకోపైలట్, వెంటనే వాకీటాకీ ద్వారా అధికారులకు సమాచారం అందించారు. విజయశాంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి బోడుప్పల్లో నివసిస్తోంది. ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో విచారణ సాగుతోంది.
