ఎన్నికల్లో ఓడిపోయానన్న ఫ్రస్టేషన్ ఓ అభ్యర్థిని రోడ్డు మీదకు తెస్తే, ఆమె మాటలు భరించలేక ఓటర్లు గ్రామ పంచాయతీ ముందు బీరు సీసాలతో నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఉప్పలవాయి గ్రామానికి చెందిన బాబవ్వ 2వ వార్డు నుంచి పోటీ చేశారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి బీర్లు, చీరలు, కూల్ డ్రింక్స్ పంచారు. అయితే ఫలితాల్లో ఆమె ప్రత్యర్థి అభ్యర్థి గెలుపొందారు. ఓటమిని తట్టుకోలేకపోయిన బాబవ్వ “అన్నీ తాగి నన్ను ఓడగొడతారా?” అంటూ గత వారం రోజులుగా ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. దూషణలు భరించలేని మహిళా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాబవ్వ ఇచ్చిన బీరు సీసాలు, చీరలు, థమ్సప్ బాటిళ్లను తీసుకువచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పడేసి నిరసన తెలిపారు.

ఉద్రిక్తత పెరగడంతో రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించారు. తాము అడగకుండానే ఇచ్చి, ఇప్పుడు తిట్టడం ఏంటని మహిళలు నిలదీశారు. అనంతరం వాటిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లారు.
