ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన ‘మేడారం సమ్మక్క-సారలమ్మ’ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. 2026 జనవరిలో జరగనున్న ఈ మహా వేడుక కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 200 కోట్లు కేటాయించింది.

మంగళవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మరియు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మేడారంలో పర్యటించి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.
మహా జాతర 2026 జనవరి 28, 29, 30, 31 తేదీలలో అత్యంత వైభవంగా జరగనుంది.

అమ్మవార్ల గద్దెల విస్తరణ పనులతో పాటు రెడ్డిగూడెం, ఉరట్టం, కన్నెపల్లి, కొత్తూరు గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను మంత్రులు తనిఖీ చేశారు. ఈసారి జాతరలో చేసే పనులు కేవలం తాత్కాలికమే కాకుండా, రాబోయే వందేళ్ల అవసరాలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

చిలకలగుట్ట పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

