మహారాష్ట్రలోని Tadoba Andhari Tiger Reserve నుంచి వచ్చినట్లు భావిస్తున్న పెద్దపులి నిజామాబాద్ జిల్లాలో భయాందోళనలు సృష్టిస్తోంది. గత పది రోజులుగా ఈ పులి సంచారం స్థానిక ప్రజలు, అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తోంది.
ఇటీవల భీంగల్ మండలం దేవక్కపేట గ్రామ పరిధిలో రైతులు భూక్యా చంద్రు, మంగ్యకు చెందిన రెండు ఆవులపై దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో కట్టేసిన ఆవులను ఉదయం వెళ్లి చూసిన రైతులు అవి మృతిచెందినట్లు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పంచనామా నిర్వహించి గ్రామస్తులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లి సాయంత్రం లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.పులి మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
