తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ తన కార్యాలయాన్ని తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం (అనెక్స్ భవనం) లో ప్రారంభించింది.

కమిషన్ ఇప్పటికే కల్తీ నెయ్యికి సంబంధించిన కీలక రికార్డులను పరిశీలించడం ప్రారంభించింది. ఇకపై పూర్తిస్థాయి విచారణ కార్యక్రమాలు ఈ కొత్త కార్యాలయం నుంచే సాగనున్నాయి. కమిషన్కు లైజనింగ్ అధికారిగా రవిని ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు టీటీడీ నుంచి ఐదుగురు సహాయక సిబ్బందిని కమిషన్కు కేటాయించారు. వచ్చే 45 రోజుల్లో విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది? టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఎలా అతిక్రమించారు? అనే కోణంలో ఆధారాలను సేకరిస్తున్నారు. కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా నివేదికలో సిఫార్సులు చేయనున్నారు.ఈ విచారణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
