కర్ణాటక ప్రతిపాదనతో ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చ
తొలి హారతి హక్కుల విస్తరణపై భిన్నాభిప్రాయాలు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సంప్రదాయాలు, దర్శన విధానాల చుట్టూ తరచూ ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంటుంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో “తొలి హారతి” వీక్షణకు సంబంధించి తీసుకున్న ఒక ప్రతిపాదన తెలుగు రాష్ట్రాలతో పాటు ఆధ్యాత్మిక వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. కర్ణాటకకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు , న్యాయమూర్తులు మరియు ఉన్నతాధికారులకు Tirumala శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం జరిగే అత్యంత పవిత్రమైన తొలి హారతిని వీక్షించే భాగ్యాన్ని కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఒక సరికొత్త ప్రోటోకాల్ను త్వరలోనే తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించడం ఈ దుమారానికి కారణమైంది.
400 ఏళ్ల చారిత్రక నేపథ్యం: తొలి హారతి ప్రాధాన్యం ఏమిటి:
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం సమర్పించే తొలి హారతికి, కర్ణాటక ప్రాంతానికి మధ్య దాదాపు 400 సంవత్సరాల సుదీర్ఘమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, ఆ తర్వాతి కాలంలో మైసూరును పాలించిన వొడయార్ రాజవంశీకులు తిరుమల దేవస్థానానికి అపారమైన బంగారు ఆభరణాలు, భూములు మరియు నిత్య పూజా ద్రవ్యాలను కానుకలుగా సమర్పించారు. మైసూరు సంస్థానం వారు ఆలయంలో జరిగే నిత్య పూజా కార్యక్రమాల్లో అత్యంత చురుకైన మరియు కీలకమైన పాత్ర పోషించినందున… దానికి కృతజ్ఞతగా ప్రతిరోజూ ఉదయం స్వామివారికి ఇచ్చే ప్రథమ హారతిని స్వీకరించే విశిష్ట గౌరవం, హక్కు మైసూరు రాజవంశీకులకు దక్కింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూడా ఈ చారిత్రక సంప్రదాయాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా కొనసాగిస్తూ వస్తోంది. ఈ సంప్రదాయ నియమావళి ప్రకారం… కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా గర్భాలయం వెలుపల ఉండే “కులశేఖరపడి” వరకు వెళ్లి, కర్ణాటక రాష్ట్ర ప్రజలందరి తరఫున ఆ తొలి హారతిని కళ్ళకద్దుకుని స్వీకరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి హాజరు కాలేని పక్షంలో, ప్రభుత్వం తరఫున నియమించబడిన ఒక ప్రత్యేక అధికారి మాత్రమే ఈ పవిత్ర బాధ్యతను పూర్తి చేస్తారు.
డి.కె. శివకుమార్ కొత్త ప్రతిపాదన ఏమిటి
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ నిబంధనలను మరింత విస్తృతం చేస్తూ సరికొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు డి.కె. శివకుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం ముఖ్యమంత్రికి లేదా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారికి మాత్రమే పరిమితమైన ఈ అత్యున్నత అవకాశాన్ని… ఇకపై కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు మరియు న్యాయమూర్తులకు కూడా వర్తింపజేయాలని భావిస్తున్నారు.
ఈ విషయమై డి.కె. శివకుమార్ మాట్లాడుతూ… కర్ణాటక రాష్ట్రం నుంచి Tirumala వెళ్లే అనేక మంది ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులకు ప్రోటోకాల్ సమస్యల వల్ల సరైన రీతిలో దర్శన భాగ్యం కలగడం లేదని, వారు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. అందువల్ల, ఒకవేళ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి అందుబాటులో లేకపోతే… వారి స్థానంలో కర్ణాటక తరఫున వెళ్లే ఇతర మంత్రులు లేదా శాసనసభ్యులను అధికారిక ప్రతినిధులుగా పరిగణించి తొలి హారతి వీక్షణకు అనుమతించేలా నూతన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తన రాజకీయ జీవితంలో ఈ నిర్ణయం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఆయన అభివర్ణించారు.
టీటీడీ అభ్యంతరం ఏమిటి?
డి.కె. శివకుమార్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలయ నిబంధనలు, ఆగమ శాస్త్రాలపై అవగాహన లేకపోవడం వల్లే కర్ణాటక నేతలు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. Tirumala ఆలయ సేవలు, వీఐపీ దర్శన కోటాలు మరియు విశిష్ట అధికారాలకు సంబంధించిన తుది నిర్ణయాధికారం కేవలం టీటీడీ బోర్డుకు మాత్రమే ఉంటుంది కానీ, పొరుగు రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత ప్రోటోకాల్ నియమాలను ఇక్కడ రుద్దడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలందరికీ గర్భగుడి ముంగిట ఉండే కులశేఖరపడి వరకు వెళ్లి తొలి హారతి చూసే హక్కు కల్పిస్తే… అది ఆలయ పవిత్రతకు మరియు భద్రతా నియమాలకు భంగం కలిగిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక సంప్రదాయాలను రాజకీయ లబ్ధి కోసం లేదా వ్యక్తిగత ప్రతిష్టల కోసం మార్చడానికి వీల్లేదని, టీటీడీ తన స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.



