తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం విజయవాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు చేసిన ప్రచారం అబద్ధమని సిట్ (SIT) తాజా నివేదికతో తేలిపోయిందని వెల్లంపల్లి పేర్కొన్నారు. నివేదికలో ఎక్కడా ‘యానిమల్ ఫ్యాట్’ ప్రస్తావన లేదని ఆయన స్పష్టం చేశారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా పదే పదే పందికొవ్వు, చేపకొవ్వు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవదేవుడికి అపచారం చేసింది కూటమి ప్రభుత్వమేనని, వెంకటేశ్వర స్వామిపై వారికి ఏమాత్రం భక్తి లేదని విమర్శించారు.తప్పుడు ప్రచారంతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఈ ముగ్గురు నేతలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
