ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ డ్రామా ఆడి వృద్ధ దంపతులను బురిడీ కొట్టించాలనుకున్న సైబర్ కేటుగాళ్ల ప్లాన్ను ఉయ్యూరు పోలీసులు చాకచక్యంగా తిప్పికొట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన రిటైర్డ్ అకౌంటెంట్ కోటా శివశంకర్ (70), ఆయన భార్యను సీఐ రామారావు సమయస్ఫూర్తితో కాపాడారు.
“ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఆధార్ కార్డు ద్వారా రూ. 25 లక్షల మనీలాండరింగ్ జరిగింది.. మీపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది” అంటూ బాధితులను భయపెట్టారు.
స్కైప్ కాల్ ద్వారా సుప్రీంకోర్టు జడ్జిగా ఒకరిని చూపించి, ఆస్తుల వివరాలు చెప్పాలని, ఎవరికైనా చెబితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. గతంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సుల వల్ల అప్రమత్తమైన వృద్ధులు.. వెంటనే ఉయ్యూరు సీఐ రామారావుకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఇంటికి వెళ్లిన సీఐ.. నకిలీ పోలీస్ వీడియో కాల్లో రాగానే ఎదురుగా నిలబడ్డారు. అసలు పోలీసును చూసిన ఆ నకిలీ అధికారి భయంతో వెంటనే కాల్ కట్ చేసి పారిపోయాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఎక్కడా లేదని, ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 కి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
