ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాల (IFR) దృష్ట్యా నగరంలోని పర్యాటక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. VMRDA చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నామని చైర్మన్ తెలిపారు.కుర్సుర సబ్ మెరైన్, సీహారియర్, హెలికాప్టర్ మరియు యుద్ధ విమాన మ్యూజియంల వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను అధికారులు పరిశీలించారు. సందర్శకుల కోసం టాయిలెట్ల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం మరియు పచ్చదనం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. కైలాసగిరి మరియు తెన్నేటి పార్క్ నందు జరుగుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అంతర్జాతీయ ప్రతినిధులు తరలివస్తున్నందున ఎక్కడా రాజీ పడకుండా విఎంఆర్డిఏ పరిధిలోని అన్ని ప్రాంతాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
