విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలరని ఉయ్యూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ డి. సుభాషిణి అన్నారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సోమవారం కాటూరు గ్రామంలోని ZP హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
బాలికలు వేధింపుల పట్ల మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని ఎస్సై సూచించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి యాప్స్ ద్వారా చాటింగ్ చేయడం ప్రమాదకరమని, డిజిటల్ అరెస్ట్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. చదువుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేయడం నేరమని, అటువంటి ఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల సమాచారం కోసం 1972కు కాల్ చేయాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, రహదారి నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు.ఏదైనా ఆపద కలిగినప్పుడు తక్షణ సహాయం కోసం డైల్ 112 సేవలను ఉపయోగించుకోవాలని ఎస్సై సుభాషిణి విద్యార్థులకు వివరించారు.
