గ్రేటర్ విశాఖలో వాకర్స్పై పన్ను విధించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. మద్దిలపాలెంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఎదుట బుధవారం సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.కె.ఎస్.వి. కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం వాకర్స్ మరియు క్రీడాకారులపై పన్నులు విధించడం అన్యాయమని విమర్శించారు.

స్మార్ట్ సిటీ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పెరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు, ఇంటిపన్నులు, నీటి మీటర్లు వంటి వివిధ రూపాల్లో ప్రజలపై భారాలు పెరిగాయని, ఇప్పుడు నడకపై కూడా పన్ను విధించడం సరికాదన్నారు. నగరంలోని పార్కులు, స్టేడియంలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కూడా ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.తక్షణమే ఈ యూజర్ ఛార్జీలను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తూ, లేకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నిరసనలో పార్టీ నాయకులు, వాకర్స్ పాల్గొన్నారు.
