వైసీపీ అధినేత జగన్ తన విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. గత నెల 26వ తేదీన తన భార్య భారతీ రెడ్డితో కలిసి యూరప్ వెళ్ళిన ఆయన, అక్కడ సుమారు 15 రోజుల పాటు తన కుమార్తెలతో గడిపారు. తెల్లవారుజామున యూరప్ నుండి నేరుగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జగన్ దంపతులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ ‘కొత్త లుక్’ తో ఆకట్టుకున్నారు. జీన్స్ ప్యాంట్, షర్ట్ ధరించి చాలా క్యాజువల్ లుక్లో కనిపించారు. ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలో ఉన్న జగన్, ఆ తర్వాత తాడేపల్లికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక మే 13న పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై చర్చించనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీని నిర్వహించాలని భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలు, కార్యకర్తల సమావేశాలను తక్షణమే ప్రారంభించే దిశగా జగన్ మొగ్గు చూపుతున్నారు. పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల సమన్వయకర్తల జాబితాను ఖరారు చేయనున్నారు. రెండేళ్ల కూటమి పాలన పూర్తవుతున్న తరుణంలో, విమర్శలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పోరాటాలకు జగన్ సిద్ధమవుతున్నారు.
