చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు Vijay నటించిన ‘జన నాయకన్’ సినిమా విడుదలకు మార్గం సుగమమవుతున్నట్లు సమాచారం. ఈ వారాంతంలో చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే అవకాశముందని చిత్రబృందానికి దగ్గర వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ తెలిపింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) రివైజింగ్ కమిటీ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో ముందుగా సర్టిఫికెట్ జారీ కాలేదు. ప్రస్తుతం అధికారిక ధ్రువీకరణ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా తొలుత జనవరిలో విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై ఎగ్జామినింగ్ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావడంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడు రివైజింగ్ కమిటీ అనుమతి ఇవ్వడంతో త్వరలోనే సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విజయ్ నటించిన చిత్రం కావడంతో ‘జన నాయకన్’పై రాజకీయ, సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. గత కొన్ని నెలలుగా సినిమా సెన్సార్ ప్రక్రియ, విడుదలపై ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. అయితే సర్టిఫికేషన్, కొత్త విడుదల తేదీపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
విడుదల ఆలస్యంపై నిర్మాత వివరణ
‘జన నాయకన్’ విడుదల ఆలస్యంపై నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు Venkat K Narayana స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యాకే సినిమాను థియేటర్లలోకి తీసుకెళ్తామని చెప్పారు.
“సీబీఎఫ్సీ నుంచి తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. సర్టిఫికెట్ వచ్చిన వెంటనే సినిమాను విడుదల చేస్తాం” అని తెలిపారు.
సినిమా టైటిల్కు విజయ్ రాజకీయ ప్రయాణం కొత్త అర్థం తీసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. “టైటిల్ కార్డులో ‘తలపతి విజయ్’ బదులు ‘తమిళనాడు ముఖ్యమంత్రి’ అని పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. సినిమా ప్రారంభించినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. విజయ్ సర్ ముఖ్యమంత్రి కావడం సంతోషకరం. ఆయన నిజంగానే తమిళనాడుకు జన నాయకుడిగా మారారు. సీఎం అయిన తర్వాతే ఈ సినిమా విడుదల కావడం విధి నిర్ణయం కావచ్చు” అని చెప్పారు.
సెన్సార్ ప్రక్రియ మొదట సాఫీగా సాగిందని వెంకట్ తెలిపారు. “2025 డిసెంబరులో సెన్సార్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఎగ్జామినింగ్ కమిటీ సినిమా చూసి యూఏ/16+ సర్టిఫికేషన్ ఇస్తామని తెలిపింది” అన్నారు.
అయితే తర్వాత పరిస్థితి మారిందని చెప్పారు. “సర్టిఫికెట్ వస్తుందని ఎదురుచూస్తుండగా, సినిమాపై ఫిర్యాదు వచ్చిందని, అందుకే సర్టిఫికెట్ను నిలిపివేసి రివిజన్ కమిటీకి పంపుతున్నామని ఈమెయిల్ వచ్చింది. సినిమా ఇంకా విడుదల కాలేదు. అలాంటప్పుడు ఫిర్యాదు ఎలా వస్తుందని కోర్టును ఆశ్రయించాం” అని వివరించారు.
ఆ ఫిర్యాదు ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుల్లో ఒకరి నుంచే వచ్చినట్లు కోర్టులో తెలిసిందని నిర్మాత చెప్పారు. “ముందుగా సమ్మతి తెలిపిన సభ్యుడే తర్వాత ఫిర్యాదు చేయడంతో రివిజన్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రక్రియ కొనసాగుతోంది. థియేటర్లలో విడుదలకు అవసరమైన అన్ని నిబంధనలు పాటిస్తున్నాం” అని పేర్కొన్నారు.

