విజయనగరం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం.
అమరావతి BNS మార్చి 30.
ప్రభుత్వ శాఖల మధ్య పూర్తిస్థాయిలో సమన్వయం ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవిధంగా పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. అన్నిశాఖలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని ఆమె ఆదేశించారు. మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వేసవి కాలాన్ని దృష్టిలోపెట్టుకొని త్రాగునీరు, పారిశుధ్యం, అగ్నిప్రమాదాల నివారణ, ఉద్యాన సాగు, గ్యాస్ సరఫరా, సాగునీరు తదితర కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంపద సృష్టి కూడా ముఖ్యమని పేర్కొన్నారు. వేసవిలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, నీరు కలుషితం కాకుండా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, దానిని దృష్టిలో పెట్టుకొని వడదెబ్బకు గురికాకుండా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. అలాగే అగ్నిప్రమాదాలు సంభవించకుండా అగ్నిమాపకశాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. బాణాసంచా తయారీ కేంద్రాలు, స్క్రాప్ నిల్వ ఉంచే కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. బస్సు ప్రమాదాల నివారణపైనా దృష్టిపెట్టాలన్నారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. గృహవసర సిలండర్లు సరఫరాలో ఎటువంటి సమస్యా లేదని, ఎప్పటిలాగే సరఫరా జరుగుతుందని చెప్పారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా ఎక్కువమంది ఒకేసారి బుకింగ్ చేపడుతున్నారని అన్నారు. గ్యాస్ సరఫరాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పర్యవేక్షణకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
