మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 9 (బీఎన్ఎస్): మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందోననే అంశంపై ప్రత్యక్షంగా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా… క్షేత్ర స్థాయిలో పాలసీలు అమలుకానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. వారి వారి శాఖల పనితీరు ఎలా ఉందన్న అంశంపై పరిశీలించడానికి తరుచూ ఫీల్డ్ విజిట్స్ చేపట్టాలని సీఎం సూచించారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరుచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బ్లాకులో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…’ప్రతీ ఐదేళ్లకూ జీఎస్డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలి. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తుంది. కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల విషయంలో జాగ్రత్తగా అంచనాలు వేయాలి. క్షేత్రస్థాయి నుంచి తీసుకునే సమాచారం ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకోవాలి. పీ4 అనేది రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే ప్రత్యేక కార్యక్రమం. మార్గదర్శులు బంగారు మిత్రలను నియమించుకోవాలి… వారి ద్వారా ఆయా పేద కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం. 2019-24 మధ్య ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బతీశారు. జీతాలు కూడా మొదటి తేదీకి ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు జీతాల చెల్లింపులను గాడిలో పెట్టాం… సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న కొన్ని జిల్లాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. అలాగే భవిష్యత్తులో ఆ జిల్లాలు లైమ్ లైట్లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకు కశ్మీర్ లో మాత్రమే కుంకుమ పువ్వు ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతుంది. కాఫీ సాగు పెంచటంతో పాటు అరకు కాఫీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాం.. ఇది మరింతగా పెరగాలి”అని సీఎం చంద్రబాబు వివరించారు.
నార్మల్ డెలివరీలు పెరిగేలా అవగాహన కల్పించండి
“సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలి. 5 లక్షల మంది హాస్టల్ విద్యార్ధుల స్ర్కీనింగ్ చేపట్టాలి. 12వ తరగతి వరకూ ఉన్న 70 లక్షల మంది విద్యార్ధుల హెల్త్ ప్రోఫైల్స్ కూడా తయారు చేయాలి. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, పెరుగుదలను నమోదు చేయాలి. పౌష్టికాహారం అందించటంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు. అవిశ, మునగ, రకరకాల ఆకు కూరల్లో పౌష్టికాహారం లభిస్తుంది. పూర్వ కాలంలో మనం రోజూ తినే ఆహారంలోనే పోషకాహారాలు ఉండేవి. రాను రాను వాటిని ఆహారంగా తీసుకోవడం మానేయడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలలోనూ పౌష్టికాహారాన్ని అందించేలా కార్యాచరణ ఉండాలి. వీలుంటే అన్న క్యాంటీన్లల్లో కూడా పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇక డెలివరిల విషయంలో నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలి… సీజేరియన్ ఆపరేషన్లు తగ్గాలి. ఈ మేరకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ ఏపీగా డిక్లేర్ చేస్తాం. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా జూన్ నాటికి సమగ్రమైన ఓ కార్డు జారీ చేస్తాం. మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జనాభా విషయంలో చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. యూరోప్ లోని దాదాపు 20 దేశాల్లో ఏజింగ్ సమస్యతో.. ఒంటరిగా తయారైంది. సామాజిక వేడుకలే లేవు” అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఒత్తిడి లేని విద్యాబోధనే లక్ష్యంగా…
“పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి. పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా ఈ కార్యాచరణలో భాగం చేయాలి. ఒత్తిడి కారణంగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోడానికి వీల్లేదు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే కొత్త ఆలోచనలు వస్తాయి… ఇన్నోవేషన్లకు ఆస్కారం ఉంటుంది. విద్యా వ్యవస్థలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు అధిక ప్రాధాన్యతనివ్వాలి. వయోజన విద్యలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా డ్వాక్రా మహిళల సహకారం తీసుకోవాలి. నైపుణ్యాలు పెంచే అంశంపై కొత్తగా ఆలోచనలు చేయాలి. లేటరల్ ఎంట్రీ ఉండేలా యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చర్యలు చేపట్టాలి. ఓ ఎలక్ట్రీషియన్ , ఓ కార్పెంటర్ వంటి వారు ఉన్నత విద్యను అభ్యసించి సర్టిఫికెట్లను పొందేలా కార్యాచరణ ఉండాలి. కేంద్రం అమలు చేస్తున్న కర్మయోగి పథకంలో ఏపీకి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. నైపుణ్య కల్పనలో భాగంగా ఐటీఐలు, కళాశాలల్లో కాన్వోకేషన్లు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి. అని ముఖ్యమంత్రి వివరించారు.
