భాగస్వామ్య లక్ష్యాలు, చేపట్టాల్సిన చర్యల్ని వెల్లడించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
రాష్ఠ్రంలో ప్రజల ఆరోగ్య భద్రత, వైద్య విధానాలు, పద్ధతుల్లో సమగ్ర మార్పులకు వడివడిగా అడుగులు పడుతున్నాయని, ఈ దిశగా విలువైన సాంకేతిక సహకారాన్ని గేట్స్ ఫౌండేషన్ అందిస్తోందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ‘బిల్ గేట్స్ ఫౌండేషన్’ భాగస్వామ్యం ఎంతో ఉపకరిస్తుందని మంత్రి ఆదివారంనాడొక ప్రకటనలో పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం నాడు ఏపీ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలపై చర్చిస్తారు.
భాగస్వామ్య లక్ష్యాలు
అధునిక సాంకేతిక విజ్ఞాన అవలంబన, సంస్కరణల ద్వారా అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కార మార్గాల ద్వారా పౌష్టికాహార లభ్యత, ఆరోగ్య భద్రతలతో ప్రజలందరికీ మెరుగైన సేవల్ని అందించడం ‘రాష్ట్ర ప్రభుత్వం-గేట్స్ ఫౌండేషన్’ భాగస్వామ్య ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. ఈ మేరకు ఇప్పటికే పలు చర్యల్ని తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.
జబ్బుల బారిన పడిన వారికి వైద్యం అందించే సాంప్రదాయ విధానానికి భిన్నంగా…వ్యాధులు సోకటాన్ని ముందుగానే పసిగట్టి, వాటి నివారణా చర్యలతో పాటు, ప్రజల ప్రస్తుత ఆరోగ్య స్థితిగతుల్ని వ్యక్తిగతంగా సమగ్రంగా పరీక్షించి, వారికి జబ్బులొచ్చే అవకాశాల్ని ముందుగానే హెచ్చరికలు చేయడం, వ్యక్తిగత హెల్త్ కార్డుల్ని రూపొందించడం, డిజిటల్ ఆరోగ్య సేవలు (టెలిమెడిసిన్) అందించే దిశగా వైద్యారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ దిశగా వైద్యారోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారం-ముందడుగులు
ప్రస్తుత విధానాలు, పద్ధతులను సమగ్రంగా సమీక్షించి ఆరోగ్యాంధ్ర సాధనకు చేపట్టాల్సిన విధానాలపై నివేదించేందుకు గేట్స్ ఫౌండేషన్ సూచన మేరకు 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఒక ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ(హైపవర్ ఎక్స్పర్ట్ ఎడ్వయిజరీ గ్రూప్) ని ఏర్పాటు చేసి, మొదటి సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించామని మంత్రి తెలిపారు. వివిధ అంశాలపై సూచనలు చేసేందుకు 3 సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
గేట్స పౌండేషన్ సూచించిన మేరకు వివిధ పధకాల అమలుకు భాగస్వామ్యుల ద్వారా కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. సమీకృత (ఇంటిగ్రేటెడ్) విధానంలో సాంకేతికత సహకారంతో వివిధ ఆరోగ్య కేంద్రాల సమన్వయంతో రియల్ టైంలో ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఉద్దేశించిన ‘సంజీవని’ పథకాన్ని టాటా ఎండి సహకారంతో ప్రారంభించామని, కుప్పంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసి చిత్తూరు జిల్లాకు విస్తరించామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
వైద్య రంగంలో ఆశించిన మార్పులను సాధించడానికి, వైద్యం అందరికీ సులువుగా లభించే విధంగా చూసేందుకు ఆధునిక సాంకేతిక విజ్ఞాన అవలంబన కీలకమని, ఈ దిశగా కూడా గేట్స్ పౌండేషన్ సహకారంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత జాతీయ విధాన రూపకల్పన దిశగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విజయవాడలో గతేడాది డిసెంబరులో వివిధ రాష్ట్రాలతో మొదటి విడత చర్చలు జరిపామని మంత్రి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల్లో ఏఐ ఆధారిత సాంకేతికతను ప్రవేశపెట్టే దిశగా నిర్ధిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు.
మెడ్ టెక్ ఛాలెంజ్
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో…వివిధ వైద్య సేవల్లో తోడ్పడే ఏఐ ఆధారిత పరికరాలను, యంత్రాలను గుర్తించే దిశగా ‘మెడ్ టెక్ ఛాలెంజ్ ‘ చేపట్టి ఆసక్తిదారుల్ని ఆహ్వానించా0.
